ఎల్నినో'ను ఎదుర్కొనేందుకు సిద్ధమవుతోన్న సర్కార్ - మహారాష్ట్ర ప్రణాళికపై అధ్యయనానికి నిర్ణయం
ఎల్నినో ప్రభావంతో నెలకొన్న వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు నీటిని ఆదా చేయడం, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటల సాగు వంటి విధానాల ద్వారా రైతులకు భరోసా కలిగించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షోభ నివారణ ముందస్తు కార్యాచరణ ప్రణాళికపై అధ్యయనం చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు వ్యవసాయశాఖకు ఆదేశాలు జారీ చేసింది. భారత వాతావరణ శాఖ అంచనాల నేపథ్యంలో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పంటలకు జరిగే నష్టాన్ని తగ్గించడానికి జిల్లాల స్థాయిలో అత్యవసర సంక్షోభ నివారణ ప్రణాళిక అమలు చేయాలని అన్ని రాష్ట్రాలకు ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై మహారాష్ట్ర సర్కార్ ముందుగా స్పందించింది. ఈ మేరకు ఆ రాష్ట్ర వ్యవసాయశాఖ వివిధ జాతీయ వ్యవసాయ, పశు, వాతావరణ పరిశోధన సంస్థలతో పాటు, ఆ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఇక్రిశాట్ల సహకారంతో కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది.