🏠 bvknews.com
Watermark
Newspaper Logo
bvknews.com | Date: 10 Jun, 2026 | Page: 1

ఈగల్ ఫోర్స్ భారీ ఆపరేషన్.. డ్రగ్ డాన్ నీతూభాయ్ పరారీ

హైదరాబాద్, జూన్ 10: హైదరాబాద్ ఐటీ కోర్ ఏరియాలో డ్రగ్ అక్రమాలపై ఈగల్ ఫోర్స్ భారీ ఆపరేషన్ చేపట్టింది. నానక్‌రాంగూడలో డ్రగ్ డాన్ నీతూభాయ్‌ను పట్టుకునేందుకు ఈగల్‌ ఫోర్స్‌ ఆపరేషన్ నిర్వహించింది. ఈగల్ ఫోర్స్ వస్తుందన్న సమాచారంతో డ్రగ్ డాన్ అక్కడి నుంచి పారిపోయినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ, నీతూభాయ్ కోసం నానక్‌రాంగూడలోనే ఈగల్ ఫోర్స్ మకాం వేసింది. ఐటీ కోర్ ఏరియాలో నీతూభాయ్ పెద్దఎత్తున గంజాయి అమ్మకాలు కొనసాగిస్తున్నట్లు బయటపడింది. నీతూభాయ్ ఇంటికి గంజాయి కొనుగోలు చేసేందుకు ఐటీ ఎంప్లాయిస్ క్యూ కట్టారు. గంట వ్యవధిలోనే 50 మంది ఐటీ ఉద్యోగులను ఈగల్ ఫోర్స్ పట్టుకుంది.ధూల్‌పేట్ నుంచి వచ్చి ఐటీ కోర్ ఏరియాలో అడ్డాపెట్టిన నీతూభాయ్.. కిరాణా షాపు మాటున గంజాయి అమ్మకాలు కొనసాగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ప్రతిరోజు ఐదు నుంచి పది లక్షల రూపాయల వరకు గంజాయి అమ్మకాలను కొనసాగిస్తున్నట్లు సమాచారం. గతంలోనే నీతూభాయ్‌ను అరెస్ట్ చేసిన అధికారులు.. పీడీ యాక్ట్ పెట్టారు. జైలు నుంచి బయటకు వచ్చిన నీతూ.. మళ్లీ గంజాయి అమ్మకాలు కొనసాగిస్తున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. డ్రగ్‌ డాన్‌ను పట్టుకునేందుకు ఈగల్ ఫోర్స్‌గా తీవ్రంగా శ్రమిస్తోంది.
🏠 Home