విద్యార్థులకు నాణ్యమైన భోజనంలో రాజీ వద్దన్న మంత్రి శ్రీధర్ బాబు
పేద విద్యార్థుల కడుపు నింపడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని తెలంగాణ ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు. సోమవారం మంథని పట్టణంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ను మంత్రి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల ఆరోగ్యం, పోషకాహారానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తోందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ప్రతి విద్యార్థికి శుభ్రమైన వాతావరణంలో తయారు చేసిన నాణ్యమైన, రుచికరమైన ఆహారం అందించడమే లక్ష్యంగా ఈ సెంట్రలైజ్డ్ కిచెన్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.మధ్యాహ్న భోజన పథకం నిర్వహణ బాధ్యతలు చేపట్టిన హరే కృష్ణ ఫౌండేషన్ ప్రతినిధులకు మంత్రి పలు సూచనలు చేశారు. ఆహార నాణ్యత, శుభ్రత విషయంలో ఎక్కడా రాజీ పడవద్దని ఆదేశించారు. నిర్ణయించిన మెనూ ప్రకారం పౌష్టికాహారాన్ని విద్యార్థులకు సమయానికి అందించాలని సూచించారు. పిల్లల ఆరోగ్యమే ప్రభుత్వానికి ముఖ్యమని, ఆహార తయారీలో అత్యున్నత ప్రమాణాలు పాటించాలని స్పష్టం చేశారు. విద్యార్థులకు టిఫిన్ అందించడం ద్వారా పాఠశాలల్లో హాజరు శాతం కూడా పెరుగుతుందని మంత్రి పేర్కొన్నారు.ఈ ఆధునిక వంటశాల ద్వారా మంథని నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు వేడి, నాణ్యమైన భోజనం సరఫరా కానుందని మంత్రి తెలిపారు. దీనివల్ల విద్యార్థుల హాజరు శాతం పెరగడంతో పాటు వారి ఆరోగ్య ప్రమాణాలు మరింమెరుగుపడతాయని ఆకాంక్షించారు. పేద విద్యార్థులకు పౌష్టికాహారం అందించడం ద్వారా వారి చదువుపై కూడా సానుకూల ప్రభావం ఉంటుందని పేర్కొన్నారు. విద్యార్థుల సంక్షేమానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో భాగంగానే సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, మంథని మున్సిపల్ చైర్మన్ వోడ్నాల శ్రీనివాస్, వైస్ చైర్మన్ ముస్కుల సహేందర్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కుడుదల వెంకన్న, సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్, మంథని మున్సిపల్ పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు. మంథని ఆర్డీవో సురేష్, తహసీల్దార్ అరిఫుద్దీన్, మున్సిపల్ కమిషనర్ మనోహర్ రెడ్డి, విద్యుత్ నియంత్రణ మండలి సభ్యులు శశిభూషణ్ కాచే, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు అయిలి ప్రసాద్ హాజరయ్యారు.