అమ్మ దగ్గరకు పోతా..!
ఓ దివ్యాంగుడు అగ్నిసాక్షిగా వివాహమాడిన భార్యను హతమార్చి, తాను కూడా ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన ఇది. పోలీసుల కథనం మేరకు.. తూర్పుగోదావరిజిల్లా రాజానగరం మండలం పాతతుంగపాడు గ్రామానికి చెందిన దివ్యాంగురాలు డంకాని నాగ శ్యామల(31)కు అదే గ్రామానికి చెందిన దివ్యాంగుడు కమిడి లక్ష్మణరావు(35)తో గత ఏడాది జూన్ 11న వివాహం జరిగింది. స్థానిక జగనన్న కాలనీలో అద్దె ఇంట్లో ఉంటున్నారు. లక్ష్మణరావు మెడికల్ షాపు నిర్వహిస్తున్నారు. శనివారం రాత్రి ఇద్దరూ కలిసి సమీప బంధువైన కమిడి రాంబాబు ఇంట్లో భోజనం చేసి, రాత్రి 10గంటల సమయంలో ఇంటికి చేరుకున్నారు. రాంబాబు ఆదివారం ఉదయం ఫోన్చేయగా లక్ష్మణరావు లిఫ్ట్ చేయకపోవడంతో, మరో వ్యక్తితో వెళ్లిచూడగా నాగశ్యామల ఇంటి హాల్లో రక్తపు మడుగులో విగతజీవిగా పడి ఉంది. లక్ష్మణరావు బెడ్ రూంలో ఉరేసుకుని మృతిచెంది ఉన్నాడు. మృతురాలి రెండు చేతుల మణికట్టు వద్ద గాయాలు ఉండగా, లక్ష్మణరావుకు చేతికి చీరినట్టు గాయాలున్నాయి. కాగా, లక్ష్మణరావు.. కొద్ది రోజులుగా తాను కూడా అమ్మవద్దకు వెళ్లిపోతానని అనేవాడని తెలిసింది. లక్ష్మణరావు తల్లి దాదాపు ఏడేళ్ల కిందట మృతిచెందగా, తండ్రి మూడేళ్ల కిందట మరణించారు. రాజానగరం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.