స్థానిక ఎన్నికల్లో 2024 ఫార్ములా వర్తించదు, జనసేన సత్తా చాటుతాం- మనోహర్..!!
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీలు సిద్దం అవుతున్నాయి. కూటమి నేతలు ఇప్పటికే ఈ ఎన్నికల కోసం కొత్త వ్యూహాలు సిద్దం చేస్తున్నాయి. ఇప్పటికే సమన్వయ కమిటీలు ఏర్పాటు చేసుకొని క్షేత్ర స్థాయిలో కూటమి విజయం కోసం పని చేయాలని నిర్ణయించారు. ఇందు కోసం సీట్ల కేటాయింపు పైన కొత్త ఫార్ములా సిద్దం చేసినట్లు చెబుతున్నారు. కాగా.. స్థానిక ఎన్నికల్లో తమ పార్టీకి సీట్ల పైన మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు చేసారు. మంత్రి మనోహర్ స్థానిక ఎన్నికల పైన ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. జనసేన బలాబలాలను బట్టి పోటీ చేస్తామని మంత్రి మనోహర్ స్పష్టం చేసారు. కూటమి బలోపేతమే ప్రధాన లక్ష్యంగా ఉంటుందని చెబుతూనే... అసెంబ్లీ ఎన్నికల సమయంలో తరహాలోనే సీట్లను తగ్గించుకొనే పరిస్థితి ఉండదని వ్యాఖ్యానించారు. అవసరమైతే ఒక అడుగు వెనక్కు తగ్గేందుకు సిద్ధమని చెబుతూనే.. పార్టీ కోసం కష్టపడిన నాయకులకు అవకాశం కల్పిస్తామని స్పష్టం చేసారు. కూటమితో పొత్తు అనేది అప్పటి పరిస్థితులపై రాష్ట్ర ప్రయోజనాల కోసం పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయం గా వవరించారు. అదే లెక్కలో ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో సీట్ల కేటాయింపు ఉంటుందనే ప్రచారం సరికాదని చెప్పుకొచ్చారు. గత 2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో రాష్ట్ర ప్రయోజనాల కోసమే తాము సీట్ల విషయంలో వెనక్కి తగ్గామని మనోహర్ గుర్తుచేశారు.