ఆటోలో నలుగురు శిశువులకు జన్మనిచ్చిన మహిళ..
మధ్యప్రదేశ్లోని మాండ్లా జిల్లాలో అంబులెన్స్ సకాలంలో అందకపోవడంతో ఒక గర్భిణి.. ఆటోలోనే నలుగురు శిశువులకు జన్మనిచ్చింది. అయితే, దురదృష్టవశాత్తూ పుట్టిన కొద్దిసేపటికే ఆ నలుగురూ కన్నుమూయడం తీవ్ర విషాదాన్ని నింపింది. మాండ్లా జిల్లాకు చెందిన రజని సింగరామ్ అనే మహిళకు నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు అంబులెన్స్ కోసం ప్రయత్నించారు. కానీ సమయానికి వాహనం రాకపోవడంతో ఆమెను ఆటోరిక్షాలో బిచ్చియా కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు తరలించేందుకు సిద్ధమయ్యారు. దురదృష్టవశాత్తూ ఆసుపత్రికి వెళ్లే మార్గంలోనే ఆటోలోనే ఆమె నలుగురు శిశువులకు జన్మనిచ్చింది. అయితే సరైన వైద్య సదుపాయం లేకపోవడంతో పుట్టిన కాసేపటికే వారంతా మృతిచెందారు. సమయానికి అంబులెన్స్ రాకపోవడమే ఈ ఘోరానికి కారణమని ఆమె భర్త తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.